సువర్ణ ఇండియా మోసం కేసు.. ఎండీ, డైరెక్టర్లకు కఠిన కారాగార శిక్ష

  • సువర్ణ ఇండియా మోసం కేసులో కీలక తీర్పు వెల్లడి
  • ఫ్రెండ్‌షిప్‌ బాండ్ల పేరుతో 1600 మంది నుంచి రూ.7 కోట్ల వసూలు
  • 2015లో నమోదైన కేసులో రాజమహేంద్రవరం కోర్టు తీర్పు
  • నిందితులకు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు
ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన సువర్ణ ఇండియా ఇన్‌ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్ మోసం కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వందలాది మంది పేద ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో సంస్థ ఎండీ సహా డైరెక్టర్లను దోషులుగా తేల్చిన కోర్టు, వారికి కఠిన కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించింది. సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఈ తీర్పును వెలువరించారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా మీడియాకు వెల్లడించారు. రాజోలు మండలానికి చెందిన బూసిం వెంకట నాగ వేణు, తన కుటుంబ సభ్యులను డైరెక్టర్లుగా పెట్టుకుని 2011లో సువర్ణ ఇండియా సంస్థను ప్రారంభించారని, రియల్ ఎస్టేట్, స్టీల్, టీవీ ఛానల్స్ వంటి వ్యాపారాల్లో పెట్టుబడుల పేరుతో ఫ్రెండ్‌షిప్‌ బాండ్ల ద్వారా 1600 మంది నుంచి సుమారు రూ.7 కోట్లు వసూలు చేశారని తెలిపారు. అనంతరం 2015లో సంస్థను మూసివేసి ప్రజలను మోసగించారని చెప్పారు.

బాధితుల ఫిర్యాదు మేరకు అప్పట్లో అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆరు కేసులు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ అనంతరం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. సంస్థ ఎండీ బూసిం వెంకట నాగ వేణుకు (A1) ఆరు కేసుల్లో ఒక్కొక్కదానికి ఏడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష, రూ.7.20 లక్షల జరిమానా విధించారు. కంపెనీకి (A2) రూ.30 లక్షల జరిమానా, డైరెక్టర్ బూసిం రాజ్యలక్ష్మికి (A3) ఐదేళ్ల జైలు శిక్ష, రూ.7.20 లక్షల జరిమానా, మరో డైరెక్టర్ బూసిం గౌతమికి (A6) మూడేళ్ల శిక్ష, రూ.4.20 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఏ4, ఏ5 నిందితులకు శిక్ష పడలేదని ఆయన చెప్పారు.

Suvarna India
Suvarna India scam
Rajamahendravaram
Andhra Pradesh
Rahul Meena
Real Estate fraud
Investment fraud
Financial crime
East Godavari district

More Telugu News